హైదరాబాదులో మంత్రి సీతక్కకు వినతి పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పి.మధుసూదన్ రెెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు ఎం.ఎస్.ఎస్. వాణి, కార్యనిర్వాహక కార్యదర్శి కె.అరుణ్
బురుజు.కాం Buruju.com : Hyderabad: గ్రామ పంచాయతీల పెండింగు బిల్లుల సమస్యను అతి త్వరలోనే పరిష్కరించి నిధులను విడుదల చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కార్యదర్శుల సమస్యలను సైతం కొలిక్కి తెస్తామని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులకు ఆమె వెల్లడించారు. కార్యదర్శులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు మరింత మెరుగైన సేవలను గ్రామీణులకు అందజేయాలని మంత్రి సూచించారు. పంచాయతీల్లో క్యాడర్ స్ట్రెంగ్తు పెంపుదలకు, గ్రేడ్ ఫోర్ కార్యదర్శుల ఎఫెక్టెడ్ తేదీ నిర్ధారణకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేయటం పట్ల సంఘ ప్రతినిధులు హర్షం ప్రకటించి మంత్రికి ధన్యవాదాలను తెలియజేశారు.
మంత్రి సీతక్కకు పుష్ప గుచ్ఛం అందజేత
ఖజానా శాఖ ఆంక్షలు కారణంగా గత 16 నెలలుగా తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధులు అందని పరిస్థితి నెలకొంది. దీంతో పనులను చేసిన గుత్తేదార్లు నుంచి కార్యదర్శులు నిత్యం తీవ్ర వత్తిడిని ఎదుర్కోవలసి వస్తోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం ( TPSA) అధ్యక్షులు పి.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు ఎం.ఎస్.ఎస్.వాణి , ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.అరుణ్ తదితరులు జూన్ 17వ తేదీన హైదరాబాదులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి పెండింగు బిల్లులతో సహా 11 సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై ఒక వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగు బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని వారికి మంత్రి హామీని ఇచ్చారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నేరుగా ఎంపికైనందున వారి నాలుగేళ్ల సర్వీసు కాలంలోని రెండేళ్లను ప్రొబేషన్ గా నిర్ధారించి నాలుగు నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని, వారికి పదోన్నతులను కల్పించాలని మంత్రిని సంఘ నాయకులు కోరారు. పంచాయతీలను జనాభా/ఆదాయం ప్రాతిపదికన గ్రేడులుగా విభజించి క్యాడర్ స్ట్రెంగ్తును నిర్ధారించేందుకు నవీన్ మిత్తల్ సారధ్యంలోని అధికారుల కమిటీ నిర్ణయించినందుకు వారు హర్షం ప్రకటించి అతి త్వరలోనే మార్గదర్శకాలను వెలువరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ విధానంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తూ నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసిన వారిని గ్రేడ్ ఫోర్ కార్యదర్శులుగా పదోన్నతిని కల్పించాలని అభ్యర్ధించారు.
పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యద్శిగా జూన్ 17వ తేదీన బాధ్యతలను స్వీకరించిన ఎన్.శ్రీధర్ ను కలిసిన సంఘ నాయకులు
గ్రామ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు హాజరయ్యే కార్యదర్శులకు ప్రయాణ భత్యాలను చెల్లించాలని, పనుల భారం పెరిగినందున సిమ్ తో కూడిన ట్యాబులను వారికి అందజేయాలని సంఘ నాయకులు కోరారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సోషల్ ఆడిట్ అంశాల్లో కార్యదర్శులను బాధ్యులుగా చేయటం తగదని, చట్టాన్ని అనుసరించి ప్రతి గ్రామానికి ఒక రోజ్ గార్ ప్రముఖ్ ను నియమించాలని సూచించారు. జీవో 317 ద్వారా వేరే జిల్లాలకు ,జోన్లకు బదిలీ అయినవారిని తిరిగి వారి సొంత జిల్లాలు, జోన్లలో నియమించాలన్నారు. అనంతరం సంఘ నాయకులు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా తాజాగా బాధ్యతలను స్వీకరించిన ఎన్.శ్రీధర్ ను కలిసి కొన్ని ప్రధాన సమస్యలను ఆయనకూ వివరించారు.