హైదరాబాదులో జూన్ 18వ తేదీన నిర్వహించిన తెలంగాణ పెన్షనర్ల జేఏసీ కార్యవర్గ సమావేశం వేదికపై జేఏసీ నాయకులు (2) సమావేశానికి హాజరైన ప్రతినిధులు
బురుజు.కాం Buruju.com : Hyderabad: తెలంగాణలోని పెన్షనర్ల సంఖ్య ఉద్యోగులతో సమానంగా ఉన్నప్పటికీ వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని, వారితో కనీసం భేటీకైనా ఆసక్తిని చూపించటంలేదని రాష్ట్ర పెన్షనర్ల సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ( JAC జేఏసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన మాదిరిగా పెన్షనర్ల ప్రతినిధులతోను ప్రభుత్వం వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించింది. పెన్షనర్లు అంటేనే వయోధికులు కావటాన వారి నాలుగు కరువు భృతి (DR) బకాయిలను ఒకే సారి చెల్లించాలని కోరుతూ తీర్మానించింది. పెద్ద ఎత్తున పేరుకు పోయిన పదవీ విరమణ ప్రయోజనాలనూ వెంటనే విడుదల చేయాలని డిమాండు చేసింది.
సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య
ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో కాని, ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం , నవీన్ మిత్తల్ కమిటీ భేటీల్లో కాని పెన్షనర్ల ప్రస్తావన అంటూ లేకపోవటం పట్ల జేఏసీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆయా కమిటీలు ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరిపినట్టుగానే పెన్షనర్ల నాయకులతోను సమావేశమయ్యి సమస్యలను తెలుసుకోవాలని కోరింది. జేఏసీ కార్యవర్గం చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య అధ్యక్షతన జూన్ 18వ తేదీన హైదరాబాదు ముసారంబాగులోని రెవెన్యూ భవన్ లో సమావేశమయ్యింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జేఏసీ కార్యవర్గానికి ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత నిర్వహించిన తొలి సమావేశం కావటంతో భేటీకి వివిధ పెన్షనర్ల సంఘాలకు చెందిన నాయకులు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జేఏసీ ఇటీవల చేపట్టిన కార్యకలాపాలను ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ నివేదించిన అనంతరం సమావేశం కొన్ని తీర్మానాలను ఆమోదించింది.
ప్రభుత్వంతో చర్చలు జరిపేటప్పుడు తమ సమస్యలను కూడా జోడించాలని కోరుతూ జేఏసీ నాయకులకు వినతి పత్రాన్ని అందిస్తున్న గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల ప్రతినిధులు
వేతన సవరణ సంఘాలకు, డీఏ,డీఆర్ లకు మంగళం పాడే రీతిలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకించాలని జేఏసీ నాయకులు నిర్ణయించారు. ప్రధాన మంత్రి పేరుతో వినతి పత్రాలను రూపొందించి సంతకాలను సేకరించిన పిదప వాటిని జూన్ 23వ తేదీన జిల్లాల కలెక్టర్లకు అందజేయాలని తీర్మానించారు. కేంద్ర చట్టం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిందే అయినప్పటికీ భవిష్యత్తులో దానిని రాష్ట్రాలు తప్పకుండా అమలు చేస్తాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వేతన సవరణ సంఘం నివేదికను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెప్పించుకొని పెన్షనర్లతో చర్చలు అనంతరం సిఫార్సులను అమలు చేయాలని కోరారు.
దాదాపు మూడు గంటల సేపు నిర్వహించిన సమావేశానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రతినిధులు
ఆసుపత్రులకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది పెన్షనర్లను సులువుగా గుర్తుపట్టే విధంగా ఆరోగ్య కార్డుల్లో మునపటి మాదిరిగా ‘P’ అనే అక్షరాన్ని పొందుపర్చాలని , వెంటనే ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసి మార్గదర్శకాలను వెలువరించాలని తీర్మానించారు. నగదు రహిత చికిత్స సదుపాయాలను గ్రంధాలయ సంస్థలు, మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్శిటీల బోధనేతర సిబ్బంది , గురుకుల పాఠశాలల పెన్షనర్లకు కూడా వర్తింపజేయాలని జేఏసీ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది . పెన్షనర్లతో ప్రత్యేకంగా భేటీలను నిర్వహించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖను అందజేయాలని నాయకులు నిర్ణయించారు.