ముఖ్యమంత్రి జగన్ చెప్పే ‘సిద్ధం’కు అసలు అర్ధం ఇదీ!
personBuruju Editor date_range2024-02-22
1)జైన సిద్ధుడు (2) అక్షరాభ్యాసం రోజున ‘ఓం నమః శివాయ సిద్ధం నమః ’ అనే అక్షరాలు గల పలకను పట్టుకొన్న బాలిక (3) సిద్ధం అంటూ ఏపీలో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్న జగన్ పోస్టర్లు
బురుజు.కాం Buruju.com: Hyderabad: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ‘సిద్దం’ పేరుతో ఇటీవల బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. సిద్ధం అంటూ పెద్ద అక్షరాలతో రాసిన బోర్డులు రాష్ట్రంలో పలు చోట్ల దర్శినమిస్తున్నాయి. దేనికి సిద్ధం? ఇంటికి వెళ్లి పోవటానికి సిద్ధమా? అంటూ ప్రతి పక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అసలు సిద్ధం అంటే ఇప్పుడు అంతా భావిస్తున్న సన్నిద్ధత అనే అర్ధం కానేకాదు. అది జైనం నుంచి వచ్చిన పదం. ఇప్పటికీ పిల్లల అక్షరాభ్యాసం సమయంలో ‘‘ ఓం నమః శివాయ సిద్ధం నమః ’’ అని తొలుత రాసి ఆ తర్వాత అక్షరాలను నేర్పిస్తారు. ప్రాధమిక పాఠశాల స్థాయిలో సైతం తెలుగు భాషకు బదులు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్.. తెలుగు వారి ఓనమాల సంప్రదాయంలోని ‘సిద్ధం’ను ఇప్పుడు తన రాజకీయానికి వాడుకొంటుండటం ఒక వింతైన పరిణామం. కొన్ని గంథాల్లోని అంశాల ఆధారంగా Buruju.com అందిస్తున్న ఆసక్తికర కథనం ఇది.
చంద్రబాబు దంపతులు మనవడికి సిద్ధం నమః అక్షరాలను రాసి దిద్దిస్తున్నప్పటి చిత్రం
తెలుగు నాట గల అక్షరాభ్యాస సంప్రదాయం వేల ఏళ్ల నాటిది. ఇది అప్పట్లో జైనుల ద్వారా వ్యాప్తిలోకి వచ్చింది. వారు జైన సిద్ధునికి నమస్కారం అనే అర్ధంలో ‘ సిద్ధం నమః’ అని రాసేవారు. బౌద్దుల పూర్వీకులు కూడా యోగ సిద్ధులే కావంతో వారూ దీన్ని కొనసాగించారు. అందువల్లనే బౌద్ధులైన సాతవాహనుల, ఇక్ష్వాకుల శాసనాలు ‘సిద్ధమ్’ మాటతో మొదలవుతాయి. తెలుగునేలపై జైన, బౌద్ధాల ప్రాభల్యం తగ్గి వాటి స్థానంలోకి శైవం వచ్చాక ‘సిద్ధం నమః ’ కు ముందు ’ ఓం నమః శివాయ’ చేరినట్టు ప్రముఖ సాహితీకారులు తిరుమల రామచంద్ర తన ‘పలుకుబడి’ గ్రంథంలో రాశారు. అక్షరాభ్యాసం రోజున చిన్న పిల్లలు నోరు తిరగక ‘ఓం నమః శివాయ’ వాక్యాన్ని ‘ఓనమశివాయ’ అనేవారు. ఓనమశివాయ కాస్తా క్రమేణా ఓనమాలుగా మారి తెలుగు అక్షరాలను ఆ పేరుతో పిలవటం అలవడిందని ప్రముఖ రచయిత సురవరం ప్రతాప రెడ్డి తన ‘ఆంధ్రుల సాంఘీక చరిత్ర’లో వెల్లడించారు.
సిద్ధం పోస్టర్లను చూపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
సిద్ధం అంటే విజయ సూచికమని ప్రఖ్యాత చరిత్రకారులు బావరాజు వెంకట కృష్ణారావు 1959, ఫిబ్రవరి నెల జయంతి మాస పత్రికలో తెలిపారు. ఇది బౌద్దం నుంచి వచ్చిందని, ధాన్యకటకం ప్రస్తావన గల వాసిస్ఠి పుత్ర పుళమావి శాసనం సిద్ధమ్ అనే పదంతోనే మొదలవుతుందని వెల్లడించారు. నాటి ప్రాకృత శాసనాలు అన్నీ సిద్ధమ్ పేరుతోనే ఆరంభమవుతాయన్నారు. బ్రహ్మణ ధర్మం విజృంభన కాలంలో సిద్ధమ్ స్తానే ‘స్వస్తి’ అని వాడటం ఆచారమయ్యిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని సిద్దవటం, సిద్దాంతం, తెలంగాణలోని సిద్ధిపేట వంటి ప్రాంతాల పేర్లు ఇలా సిద్ధంలోని సిద్ధుల నుంచే వచ్చి ఉండొచ్చనేది కొందరి భావన.
ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం
మొత్తం మీద ఇప్పుడు జగన్ భుజాల కెత్తుకొన్న ‘సిద్ధం’ మాట.. బౌద్ధ, జైన, శైవ మతాల ఆదరణతో రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది. ఆనాడు శాసనాల ఆరంభంలోను, అక్షరాలను నేర్చుకోవటం మొదలు పెట్టేటప్పుడు రాసిన సిద్ధం.. క్రమేణా ఇప్పుడు ‘రడీ’ అనే సాధారణ అర్ధంలో స్థిరపడింది. దేనికైనా సిద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు ఇప్పుడు సవాళ్లు విసురుకోవటానికి ఉపయోగ పడుతోంది. జగన్ ఫొటోలు గల పోస్టర్లలో సిద్ధం అక్షరాల పక్కన ఒక పిడికిలి సైతం కనిపిస్తోంది.